సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లోవిశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. తెలుగు చలన చిత్ర రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
బాల్యం - విద్యాభ్యాసం
సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేట్లో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదు లోని చాదర్ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. విద్యార్థిగా శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివాడు.
అతను ప్రధానంగా కవి అయినప్పటికీ ఆ కాలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రే తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.
రచనారంగమే కాక అతను తెలుగు సాహిత్య పత్రికగా స్రవంతి సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. వేమూరి ఆంజనేయశర్మ, చిర్రావూరి సుబ్రహ్మణ్యంతో పాటుగా సినారె పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించారు.[2]
పురస్కారాలు
1988వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992)
రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు
భారత రాష్ట్రపతి అతన్ని 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఆరేళ్ళపాటు సభలో అయన ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి. 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడ్డారు.
అజంతా సుందరి : 1955లో సినారె ఈ సంగీత రూపకాన్ని రచించారు. 1953లో తన తొలిరచనగా నవ్వని పువ్వు అన్న సంగీత ప్రధానమైన రూపకాన్ని వెలువరించాకా వెనువెంటనే రచించిన రూపకాల్లో ఇదీ ఒకటి. ప్రఖ్యాత అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన సంగీత రూపకం.[5]
సి. నారాయణ రెడ్డి 1962 లో గులేబకావళి కథ లోని పాటద్వారా సినిమా రంగం లోకి అడుగు పెట్టారు. నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసానీ అనే పాటతో పేరుపొందారు.[6] తర్వాత చాలా సినిమాల్లో మూడు వేలకు పైగా పాటలు రాశాడు.[7]
డా.సి. నారాయణరెడ్డి గురించి ప్రముఖుల ప్రశంసలను చీకోలు సుందరయ్య ఇలా ఉదహరించాడు [8]
చేరా - "ఇప్పటి కవుల్లో నారాయణరెడ్డిగారికున్నంత శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్లు ఎక్కువ మంది లేరు. శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్ స్ఫూర్తి. అంతేకాదు. ఆ శబ్దాలను అతికే శక్తి మహాద్భుతమైనది. శబ్దాలకు రంగు, రుచి, వాసన కలిగించే ఆల్కెమీ ఏదో సినారె దగ్గర ఉండి ఉండాలి. అది అనిర్వాచ్యం. అది పరిశోధనకందదు.
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం - "విశ్వమానవ హృదంతరాళాల్లోని చైతన్య జలపాతాల సవ్వడినీ, విప్లవ జ్వాలల వేడినీ రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి సి.నారాయణరెడ్డి. పద్యం నుండి గేయానికి, గేయం నుండి వచనానికీ అభ్యుదయాన్ని సాధిస్తూ పట్టింది బంగారంగా, పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవిచంద్రులు రెడ్డిగారు. మనిషిలోని మమతను, బాధను, కన్నీటినీ, మున్నీటినీ, అంగారాన్నీ, శృంగారాన్నీ, వియోగాన్నీ, విప్లవాన్నీ కవితల్లో కీర్తించడం రెడ్డిగారి మతం"
సాహితీ చరిత్ర రచయిత డాక్టర్ జి.నాగయ్య - "ప్రణయ కవిత్వమును, చారిత్రక గాథలను రచించి ప్రఖ్యాతులైన సి.నారాయణరెడ్డిగారు పద్యమును, గేయమును చక్కగా నడిపించగల దిట్టలు. ఛందోరహస్యము తెలిసిన నారాయణరెడ్డి ఆధునిక యుగధర్మమున కనుగుణముగా ప్రగతి మార్గములో పయనించి వచన కవిత్వమును నాజూకుగా నడిపించి ఆ ప్రక్రియకు వన్నె చేకూర్చారు. నారాయణరెడ్డి ఏదో ఒక 'ఇజము'నకు కట్టుబడక సమకాలిక సంఘటనలు తనను ప్రేరేపించినపుడు కవిగా స్పందించి చక్కని గేయాలు రచించి వాటిని సంపుటాల కెక్కించాడు... నారాయణరెడ్డి కావ్యాలలో మధ్యతరగతివారి కష్టసుఖాలే ఎక్కువగా కనబడతాయి... కులమతమ్ముల ఉక్కుడెక్కల, నలిగిపోయెడు మాలలంగని, అల్లనాడే కంటనీరిడినట్టి వెన్నెల మనసు నీయది అని అతను గురజాడకు కైమోడ్పు ఘటించాడు. ఆకలి వాకిట కేకలు పెట్టిన, ఆరని బాధల అంచులు ముట్టిన జ్వాలా శిశువుగా వీరు శ్రీశ్రీని అభినందించారు
వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు - "నారాయణరెడ్డి తిలక్లాగా రెండంచుల పదును గల కత్తి. కవిత్వంలో అగ్ని చల్లగలరూ, అమృతం కురిపించగలడు"
మరణం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణరెడ్డి, హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ 2017, జూన్ 12 సోమవారం రోజున ఉదయం తుదిశ్వాస విడిచాడు.[1]
ఇవికూడా చూడండి
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.